వాక్ క్షేత్రం - Vishwagurunidhi

  వాక్ క్షేత్రం - Vishwagurunidhi

 *మానవుడికి వున్నవి - ఆలోచనలు ( Thoughts)*

 *మానవుడికి వున్నవి - వాక్కులు (Words)*

 *మానవుడికి వున్నవి - చేష్టలు (Deeds) దీనినే మనం మనసా, వాచా, కర్మణా అని అంటున్నాం.*

*మనస్సు అన్నది ఆలోచనల సమూహం, దీనినే 'భావనా క్షేత్రం' అంటారు.వాచా అన్నది వాక్కుల సమూహం, దీనినే 'వాక్ క్షేత్రం' అంటారు.కర్మలు అన్నవి చేష్టల సమూహం! దీనినే 'చేష్టా క్షేత్రం' అంటారు. కనుక మానవ జీవితం త్రిక్షేత్రమయం.*


*1) భావనా క్షేత్రం :-*

*దీనిలో మన ఆలోచనలూ, మన ఊహలు వుంటాయి. అందులో మనం విహరిస్తూ ఉంటాం. మన భావనలు పక్షులు లాంటివి. కనుక ఎక్కడైనా విహరించవచ్చును. మన భావన ప్రపంచం అన్నది ఆస్ట్రల్ ప్రపంచంకి (సూక్ష్మ శరీర ప్రపంచం) సంబంధించినది. ఇక్కడ తప్పులూ లేవు, ఒప్పులూ లేవు.  మన తప్పోప్పులను పట్టుకునే వేరే వారెవరు ఉండరు. మన భావన లో దొంగతనాలు చేయవచ్చు, ప్రధాన మంత్రి కావచ్చు. ఇవి ఆస్ట్రల్ ప్రపంచానికి సంబంధించినవి కాని.,భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కావు.ఈ క్షేత్రంలో మనం సర్వ స్వతంత్రులం. ఎందుకంటే ఆలోచనలు అనేవి సృజనాత్మకమైనవే కాని క్రియాశీలకమైనవి కావు కనుక.*

*2. చేష్టా క్షేత్రం:-*

*క్రియా రూపకంగా మనం ఏది చేసినా దానిని మనం 'చేష్ట' అని అంటాము. అంటే తినడం, త్రాగటం, చంపడం, ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించడం మొదలైనవి. ఈ చేష్ట ప్రపంచం అనేది భూ ప్రపంచానికి సంబంధించినది. చేష్ట క్షేత్రంలో మనం సర్వ పరతంత్రులం, అంటే మనం మన గుణాలకు బందీలం. ఎవరి గుణాన్ని బట్టి వారు పనులు చేస్తూ వుంటారు. గుణం అనగా అనేకానేక జన్మ కర్మల సారం యొక్క సముచ్ఛయమే. కనుక ప్రపంచంలోని ఏ మనిషి ఐనా క్రింది 4 రకాల గుణాలలోని ఏదో ఒక వర్గానికి చెంది వుంటారు.*

*ఎ) తమోగుణం :- వీరు శారీరక సుఖాలను మాత్రమే కోరుకుంటారు. వీరికి బద్ధకం, కామం ఎక్కువ. కష్టాలు వస్తే ఆర్తనాదాలు చేస్తారు.*

*బి) రజోగుణం :- వీరు అంతులేని సుఖాలు కోరతారు. గర్వం ఎక్కువ. కీర్తికాముకులు, ఎంతటి అధర్మానికైనా తెగిస్తారు.*

*సి) సత్త్వ గుణము :- వీరు ధర్మాభిలాషులు, జ్ఞాన యోగ జిజ్ఞాసువులు. వీరు చక చక పనులు చేస్తారు. అన్యాయం జరిగిన ప్రతిఘటించరు.*

*డి) నిర్గుణం:- జ్ఞానులు, అన్యాయం జరిగిన ప్రతిఘటిస్తారు. పరమాత్మ గూర్చి ధ్యానిస్తారు. పరులచే ధ్యానింప చేస్తారు.*

*గుణాలు చాలా మెల్లిగా మారు తుంటాయి. ప్రతి మానవుడు మొట్ట మొదటగా 'తమోగుణ ప్రధాని ' గా భూమి మీదకు వస్తాడు.కొన్ని జన్మల తర్వాత 'రజోగుణ ప్రధాని' గా తయారవుతాడు. మరి కొన్ని జన్మల తర్వాత 'సత్త్వ గుణ ప్రధాని'గా మారతారు. చివరిగా 'నిర్గుణి' గా అవుతారు.*

*ఎవరి గుణాన్ని బట్టి వారు పనులు చేస్తూ వుంటారు. కనుక ఎవర్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.*

*3) వాక్ క్షేత్రం :-*

*వాక్కులు అంటే మన నోటిలో నుండి వచ్చే మాటలే. మనల్ని మనం సరి చేసుకోవలసినది. కేవలం 'వాక్ క్షేత్రం'లోనే.*

 *వాక్కులు అనేవి ప్రధానంగా మూడు రకాలు :-*

*ఏ) అశుభ వాక్కులు :- మూలాధార, స్వాధిష్టాన, మణిపూరకలో ఉండే వారంతా అశుభవాక్కులనే పలుకుతారు. ఉదా: అపనింద వేయటం, చెడు మాట్లాడటం etc.*

*బి) శుభ వాక్కులు :- అనాహత, విశుద్ధలో ఉండే వారంతా శుభవాక్కులే పలుకుతూ ఉంటారు.*

*సి) సత్య వాక్కులు - ఆజ్ఞా, సహస్రారం లో ఉండే వాళ్ళ నోటి నుండి ఎప్పుడూ సత్యవాక్కులే వస్తాయి. ఆత్మానుభవం నుండి వచ్చే వాక్కులే సత్య వాక్కులు.*

*ఉదా - నా కర్మ నాది. నీ కర్మ నీది. ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించు కుంటున్నారు అని మాట్లాడటం.*

*సత్యవాక్కులు అంటే ఆత్మ తత్వాన్ని గురించి, 'ఆధ్యాత్మికత'  గురించి, స్పిరిచ్యువల్ సైన్స్ గురించి పలికిన పలుకులే సత్యవాక్కులు.*

 *భావనా క్షేత్రంలో - మనం సర్వ స్వతంత్రులం - మన ఇష్టం వచ్చినట్లు ఆలోచనలు చేయవచ్చు.*

 *చేష్ట క్షేత్రంలో - మనం సర్వ పరతంత్రులం - మనం గుణం ఆధీనంలోనే ఉంటాము, ఎవరి గుణ ప్రకారంగా వారు పనులు చేస్తూ వుంటారు.*

 *వాక్ క్షేత్రం - మనల్ని మనం సరి చేసుకోవలసిన క్షేత్రం - సదా సత్యవాక్కులనే పలుకుతుండాలి.*

*శ్రీ కృష్ణుడు అర్జునుడితో చివరగా 'యధా ఇచ్చసి తథా కురు' అన్నారు.  అనగా "నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి'' అని అన్నారే కాని "ఓ అర్జునా ! నేను చెప్పినట్లు చెయ్యి" అని అనలేదు.*

  *ఎందుకంటే ఎవరి కర్మలను, ఎవరి చేష్టలనూ మనం సరి చేయలేం! అది అసంభవం.*

*మనం సరి చేసుకోవలసినది "వాక్ క్షేత్రం" మాత్రమే.*

✨⚡✨⚡✨⚡

*మన సంప్రదాయం ప్రకారం శూన్యము (ఖాళీ) అనేది చైతన్య స్వరూపమే.*

 *ఆ 'ఖాళీ'నే మనం "కాళీకా"దేవి గా ఆరాధిస్తున్నాము.*

 *ఆ 'ఖాళీ'లోనే సమస్త శక్తులు నిబిడీకృతమై ఉన్నాయి.*


Comments